Tuesday, 31 May 2016

శ్రీ హనుమంతుని అర్చన.....!!
హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ, భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు, పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం 'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'
శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం||
శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||
అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి''యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై|
శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు'' అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం, శిర స్స్నానం, నేలపడక, సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.
ఆచరణ: భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తోలగునట్లు చేయాలి. హనుమత్ప్ర దక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి.
అభి షేకం
పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకస్తే పరమానంద భరితుడు అవుతాడు, కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం, నిత్యమూ చేయగలగటం మరీ మంచిది.
ఆచరణ : మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినానా దాతల ద్వారా అభిషేకం జరిపింపజేయాలి.
మంగళ వార సేవ
మంగళవారంనాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. అంతా కుదురనివారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం, అరటి పండ్లు నివెదించటం చేయాలి. అందుకు కారణమైన విశేషగాధ ఉంది.
శనివార సేవ
హనుమంతుడు శనివారం జన్మించాడు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన, సహస్రనామాదికం చేయాలి. భక్తులచే అప్పాలు, వడ మాల వంటి విప్రోత్సహించి చే యించి స్వామికి సంతృప్తి కలిగించాలి.
పంచ సంఖ్య
హనుమంతుడు పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెస్వ ప్రదక్షిణాలు, నమస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు వంటి వేవ యినా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతికరం.
హనుమజ్జయంతి
హనుమంతుడు వైశాఖ మాసంలో, కృష్ణ పక్షంలో, దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం, శనివారం, కర్కాటక లగ్నంలో, వైదృతి యోగంలో జన్మిచాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏ, కల్పంతర గాధలను బట్టి ఎవరో చేప్పారని భిన్న భిన్న తిథులలో హనుమజ్జయంతి కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమినాడు తప్పక జయంతి జరపాలి. వీటిని పంచాహ్మికంగా ఐదు రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు. విశేషార్చనలు సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి.
ఆచరణ : సంవత్సరంలో ఈ ఒక్క జయంతినాడ యినా భక్తులను మారేడుదళం, సింధూరం మల్లెపూలు లేదా త ములపాకులు, తులసిదళం, ప్రత్సహించి లక్షార్చన వంటి వాటితో జరిపించాలి.

Thursday, 14 April 2016

రామ రసం ప్రాముఖ్యత

రామ రసం ప్రాముఖ్యత
దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | 
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు. భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.
శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోను బెల్లం పానకం ... పెసర వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. సీతారాములకు జరిపే కళ్యాణ వైభవంలో మార్పులు వచ్చినా, తీర్థ ప్రసాదాలుగా ఆనాటి నుంచి ఈనాటి వరకూ పానకం ... వడపప్పును పంచడం వెనుక పరమార్థం లేకపోలేదు. శ్రీ రామనవమి నాటికి ఎండలు బాగా ముదురుతాయి. వేసవి తాపం వలన శరీరంలోని ఉష్ణోగ్రత పెరగడం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు తలెత్తుతుంటాయి. శరీరంలోని శక్తి చెమట రూపంలో బయటికి ఎక్కువగా పోవడం వలన నీరసం రావడం జరుగుతుంది.
ఇలాంటి అనారోగ్యాలను నివారించడం కోసమే ఈ రోజున బెల్లం పానకం ... పెసర బేడలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. బెల్లం పానకం ... పెసరబేడలతో వడపప్పును స్వీకరించడం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంటాయి. శరీరానికి కావలసిన చల్లదనాన్ని... పోషకాలను అందిస్తూ ఉంటాయి.
జీర్ణ సంబంధమైన ... మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా, వాత .. పిత్త ... కఫ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలా ఇవి పనిచేస్తుంటాయి. అందువలన బెల్లం పానకం ... వడపప్పే గదా అనే చులకన భావనతో ఇవి తీసుకోకుండా ఉండకూడదు. ఈ రోజున వీటిని తీర్థ ప్రసాదాలుగా స్వీకరించడం వలన సీతారాముల అనుగ్రహంతో పాటు ఆరోగ్య పరమైన ఔషధం లభించినట్టు అవుతుందని చెప్పొచ్చు.
మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా,ఆయా ఋతువులను,దేహారోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవే . వడపప్పు – పానకం కూడా అంతే. శరదృతువు, వసంత ఋతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఋతువులో వచ్చే గొంతువ్యాధులకు… పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని వైద్యశాస్త్రం చెబుతోంది.
పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని కూడా చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ దెబ్బ’ తగలకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. అందుకని ఒక్క శ్రీరామనవమి రోజునే కాకుండా ఈ వేసవి లో వడపప్పు ,పానకం తీసుకుంటే మంచిది .
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు

శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి

శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము.
వైదిక వివాహం ఇలా జరుగుతుంది అని లోకానికి చాటింది సీతారాముల కల్యాణమే. అప్పటివాళ్లు ఆ కల్యాణాన్ని చూసి ముగ్ధులైపోయారని పురాణాలు చెబుతున్నాయి. ఆ వైభవాన్ని చూసే అవకాశం లేని ఈ తరాల వారికి అ అదృష్టాన్ని తన పాట ద్వారా కలిగించిన సముద్రాల గారికి వందనం!
శ్రీ సీతారాముల కల్యాణం, చూతము రారండి
చూచు వారలకు చూడముచ్చటట- పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట…
భక్తి యుక్తులకు ముక్తిప్రదమట
ఆ…ఆ…ఆ…ఆ…[ఈ ఆలాపన అద్భుతం అంతే…]
భక్తి యుక్తులకు ముక్తిప్రదమట – సురలను మునులను చూడవచ్చునట…
కల్యాణం, చూతము రారండి

దుర్జన కోటిని దర్పమడంచగ – సజ్జన కోటిని సంరక్షింపగ…
ధారుణి శాంతిని స్థాపన చేయగ
ఆ…ఆ…ఆ…ఆ…
ధారుణి శాంతిని స్థాపన చేయగ – నరుడై వెలసిన పురుషోత్తముని…
కల్యాణం, చూతము రారండి

దశరథ రాజు సుతుడై వెలసీ, కౌశికు యాగము రక్షణ చేసీ,
జనకుని సభలో హరువిల్లు విరచీ
ఆ…ఆ…ఆ…ఆ…
జనకుని సభలో హరువిల్లు విరచీ – జానకి మనసు గెలిచిన రాముని
కల్యాణం, చూతము రారండి

సిరి కళ్యాణపు బొట్టును పెట్టీ…- మణి బాసికమును నుదుటను కట్టీ
పారాణిని పాదాలకు పెట్టీ…
ఆ…ఆ…ఆ…ఆ…
పారాణిని పాదాలకు పెట్టీ… – పెండ్లి కూతురై వెలసిన సీతా
కల్యాణం, చూతము రారండి

సంపగి నూనెను కురులను దువ్వీ – సొంపుగ కస్తూరి నామము దీర్చీ
చెంప జవ్వాది చుక్కను పెట్టి
ఆ…ఆ…ఆ…ఆ…
చెంప జవ్వాది చుక్కను పెట్టి – పెండ్లీ కొడుకై వెలసిన రాముని
కల్యాణం, చూతము రారండి…

రాముని దోసిట కెంపుల ప్రోవై, – జానకి దోసిట నీలపు రాశై…
ఆణిముత్యములు తలంబ్రాలుగా…
ఆ…ఆ…ఆ…ఆ…
ఆణిముత్యములు తలంబ్రాలుగా…శిరముల మెరిసిన సీతారాముల
కల్యాణం, చూతము రారండి… శ్రీ సీతా రాముల కల్యాణం, చూతము రారండి
సిరి కళ్యాణపు బొట్టును బెట్టి/మణిబాసికమును నుదుటను గట్టి/పారాణిని పాదాలకు బెట్టి అంటూ వధువు సీతాదేవి అలంకరణను అద్భుతంగా వర్ణించడం... సంపంగినూనెను కురులను దువ్వి/సొంపున కస్తూరి నామము దీర్చి/చెంప జవ్వాజి చుక్కను బెట్టి అంటూ వరుడు శ్రీరామచంద్రుడి రూపాన్ని కళ్లముందు నిలపడం . జానకి దోసిట కెంపుల ప్రోవై/రాముని దోసిట నీలపు రాసై/ఆణిముత్యములు తలంబ్రాలుగా సీతారాముల శిరముల మీద మెరిశాయట. చూచు వారలకు చూడముచ్చటట/పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట/భక్తి యుక్తులకు ముక్ తిప్రదమట/సురులను మునులను చూడవచ్చునట ... ఈ మాటలు వింటుంటే ఆ కల్యాణం జరిగే చోటికి వెళ్లిపోవాలని, స్వయంగా దర్శించాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది.
భోజనం చేశాక తాంబూలం వేయకపోతే ఎంత వెలితిగా ఉంటుందో... ఎంత ఖర్చుపెట్టి ఘనంగా పెళ్లి చేసినా, ఈ పాట వేయకపోతే ఆ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

సీతారామ కల్యాణం ఘట్టంలో మూడు సూత్రాల ప్రాముఖ్యత

సీతారామ కల్యాణం ఘట్టంలో మూడు సూత్రాల ప్రాముఖ్యత
చైత్ర మాసమున శుక్ల పక్షమినాడు సచ్చిదానంద స్వరూపియైన రామచంద్రుడు అవతరించెను. కావున ఆ రోజున ఉపవాసము ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశో పచారములచే ఆరాధించి పురాణమును పటించి (చదివి) జాగారణముచేసి (నిద్ర మేల్కొని) మరునాడు ఉదయముననే కాలకృత్యములు, నెరవేర్చుకొని తన శక్తికి తగిన భక్తి యుక్తులతో శ్రీరామచంద్రుని పూజించి పాయసముతో అన్నము చేసి పెద్ద వారిని, బంధువులను తృప్తి పరిచి కౌసల్యా పుత్రుడైన (కొడుకైన) శ్రీరామచంద్రుని ఆనందింపజేయవలెను.
సీతారామ కల్యాణం ఘట్టంలో ముందుగా రామునికి దేవాలయంలో ద్రువమూర్తుల కల్యాణం చేస్తారు. తరువాత మంగళ వాయిద్యాలు మారు జయజయధ్వానాల మధ్య పల్లకీలో కల్యాణ మండపానికి స్వామివారు తరలివస్తారు. ముందుగా తిరుకల్యాణానికి సంకల్పం చేసి సర్వవిజ్ఞాన శాంతికై విశ్వక్సేణ పూజ నిర్వహిస్తారు. విష్ణుసంబంధమైన అన్ని పూజా శుభ కార్యక్రమాలకు విశ్వక్సేణుని పూజ చేయడం ఆనవాయితీ. తరువాత పుణ్యఃవచనం చేస్తారు. మంత్ర పూజలలో కల్యాణానికి వినియోగించే సకల సామగ్రినీ సంప్రోక్షణ చేస్తారు. ఆ తరువాత రక్షాబంధనం, మోక్షబంధనం నిర్వహిస్తారు. 24 అంగుళాల పొడవుగల 12దర్భలతో అల్లిన ఒక దర్భతాడును సీతమ్మవారి నడుముకు బిగిస్తారు. మాత్రావాహితమైన ఈ మోక్రమును ధరించినట్లయితే ఉదర సంబంధమైన అన్ని రోగాలు నశించి స్త్రీలు సంతానవతులవుతారని ప్రతీతి.
రామయ్య కుడిచేతికి, సీతమ్మకు ఎడమ చేతికి రక్షాసూత్రాలు కడతారు. స్వామి గృహస్థాశ్రమసిద్ధి కోసం సువర్ణయజ్ఞోపవితాన్ని ధరింపచేస్తారు. 8మంది వైష్ణవులకు తాంబూలాది సత్కారాలను చేసి కన్యావరణం చేస్తారు. అంటే జగన్నాథుడు దయామయుడు అయిన శ్రీరామచంద్రునికి దయాస్వరూపిని సీతమ్మే తగు వధువు అంటూ పెద్దలు నిర్ణయిస్తారు. తరువాత వధూవరుల ఇరు వంశాల పెద్దల గోత్రాలను ముమ్మారు పటిస్తారు. పాదప్రక్షాళన అనంతరం పరిమల భరిత తీర్థంతో మంత్రోక్తంగా పుష్పోదక స్నానం చేయిస్తారు. గోదానం చేసి మహాసంకల్పం పఠిస్తారు.
కల్యాణంలో పఠించే ఈ మహాసంకల్పం భారతీయ భౌగోళిక పరిజ్ఞానానికి అద్దం పడుతూ... జాతీయ భావన సామ్యాన్ని మనలో పటిష్టపరుస్తుంది. ఈ మహాసంకల్పానికి అనుగుణంగా కన్యాదానం జరుగుతుంది. సాక్షాత్ విష్ణుస్వరూపుడైన శ్రీరామునికి శ్రీ మహాలక్ష్మీ స్వరూపమైన సీతను జగత్కల్యాణార్థ్ధం మంత్రధార పూర్వకంగా ఈ కన్యాదానం జరుగుతుంది. మంగళాష్టకాలు పఠిస్తారు. అందరు ఈ వధూవరులకు మంగళం చేకూర్చాలనే భావనతో చదివే ఈ ఆశీస్సులు ఒక్క సీతారాములకే కాక వారి కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులందరికీ వర్తించే విధంగా ఉంటాయి.
మంగళవాయిద్యాలు మారుమోగుతుండగా.. మంత్రాల మధ్య అభిజిత్‌లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచుతారు. ఇది శుభలగ్నం. జగత్కల్యాణ శుభసన్నివేషం. ఈ జీలకర్ర, బెల్లం శిరస్సుపై ఉంచితే మనలో సత్యం, సద్భావనము పెంచుతుందని శాస్త్రం చెబుతోంది. ఆ తరువాత జరిగే మాంగళ్య పూజలో మంగళసూత్రంతో ముగ్గురు అమ్మవార్లను ఆవాహనం చేస్తారు. మనుషులకైతే రెండు సూత్రాలు, దేవతలకైతే మూడు సూత్రాలు ఉండాలని శాస్త్రం చెబుతుంది. తొమ్మిది పోగులతో మూడు సూత్రాలతో తయారయ్యే మంగళసూత్రం ఎన్నో వేదాంత రహస్యాలను చాటి చెబుతుంది. తొమ్మిది పోగులు వివిధ సంబంధాలకు ప్రతీకలు.
మూడు సూత్రాలు కర్మ, జ్ఞాన, భక్తిమార్గాలకు సంకేతాలు. సూత్రమూలములో గౌరీదేవిని, సూత్రమధ్యములో సరస్వతిని, సూత్రాగ్రంలో మహాలక్ష్మిని ఆవాహనం చేస్తారు. ఈ ముగ్గురమ్మల అనుగ్రహంతోనే లోకంలో సౌశీల్యం, సౌందర్యం, సౌకుమార్యం వంటి గుణాలు వర్థిల్లుతున్నాయని ప్రతీతి. ఈ ముగ్గురమ్మలను ఆవాహనం చేసిన మంగళసూత్రాలలో భక్తరామదాసు చేయించిన మంగళపతకాన్ని కలిపి ధరింపచేయడం ఆచారం. రామదాసు చేయించిన ఆభరణాలను నేటికీ మనం స్వామివారికి అలంకరించి ఆనందిస్తున్నాం. భక్త రామదాసు సీతామ్మవారికి చేయించిన చింతాకు పతకం, పచ్చల హారం, పూసలహారం, అమ్మవారి మంగళసూత్రాలు, రామటంకాలు, చంద్రపతకం, బంగారు మొలత్రాడు, తదితర ఆభరణాలు కల్యాణ మహోత్సవంనాడు శ్రీ సీతారామచంద్ర స్వామికి అలంకరిస్తారు.
ప్రభుత్వ సొమ్మును ఖజానాకు జమచేయకుండా ఆలయం నిర్మించడం అప్పటి నిజాంప్రభువు తానీషాకు ఆగ్రహం తెప్పించింది. రామదాసును గోల్కొండ కోటలో బందీగా వుంచి, చిత్రహింసలకు గురిచేశాడు. ఆ సమయంలో తనను కాపాడమని రామదాసు శ్రీ రామచంద్రుని వేడుకున్నాడు. శ్రీరామ చంద్రునికి చెప్పి తనను రక్షించమని సీతాదేవినీ వేడుకున్నాడు. ఎంతకీ శ్రీరాముడు కరుణించక పరోవడంతో తాను నిత్యం కొలిచే శ్రీరామ చంద్రునే నిందించడం ప్రారంభించాడు. సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకంబు రామచంద్రా… అంటూ , ఎవరబ్బాసొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా ..అని నిందాపూర్వకంగా వేడుకుంటాడు. చివరకు శ్రీరామచంద్రులు తన సోదరుడు లక్ష్మణునితోసహా రామోజీ, లక్ష్మోజీల పేర్లతో తానీషాకు ప్రత్యక్షమై రామదాసు చెల్లించవలసిన ఆరులక్షల వరహాలను చెల్లించి కారాగారవాసం నుంచి రామదాసును విముక్తిన్ని చేశారు.
అలనాడు తానీషా కాలం నుంచి ఆచారంగా వస్తున్న ముత్యాల తలంబ్రాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతీఏటా సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తరువాత బ్రహ్మాబంధనం వేస్తారు. దానినే బ్రహ్మముడి అని కూడా అంటారు. అనురాగ పూర్వకమైన దాంపత్య బంధానికి ఇది సంకేతం. ఆ తరువాత శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి గోదాదేవి శ్రీరంగనాథునితో కల్యాణం జరిగినట్లు కలగన్న వైవాహిక స్వప్నం వారణమాయురం అన్న పది తమిళ పద్యాలు పాడుతూ...అర్చక స్వాములు బంతులాట ఆడుతారు. అనంతరం సీతారాములకు కర్పుర నీరాజనం సమర్పిస్తారు. చతుర్వేదాలలో సీతారాములకు ఆశీర్వచనం ఇవ్వడంతో ఈ కల్యాణ క్రతువు పూర్తవుతుంది.
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు